
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘అఖండ-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కారణంగా శుక్రవారం (నవంబర్ 28, 2025) కూకట్పల్లి ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ‘అఖండ-2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ను నవంబర్ 28, 2025 శుక్రవారం సాయంత్రం కైతలాపూర్ గ్రౌండ్, కూకట్పల్లిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా, శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా జనసమ్మర్దం, ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు.
ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను సజావుగా కొనసాగించేందుకు, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. ఈవెంట్ సమయంలో కైతలాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయని ప్రకటనలో వెల్లడించారు.
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు (సా. 4 నుండి రా. 11 గంటల వరకు)
ప్రయాణికులు గమనించవలసిన మళ్లింపు మార్గాలు ఈ విధంగా ఉన్నాయి:
మూసాపేట్ వైపు నుండి వచ్చే వాహనాలు: భరత్నగర్, ఎర్రగడ్డ నుంచి GHMC ఆఫీస్ వైపు మూసాపేట్ ద్వారా వచ్చే వాహనాలను కూకట్పల్లి Y జంక్షన్కు మళ్లిస్తారు.
కూకట్పల్లి Y జంక్షన్ వైపు నుండి వచ్చే వాహనాలు: కూకట్పల్లి Y జంక్షన్ నుంచి IDL లేక్ వైపు వెళ్లే వాహనాలను JNTU మార్గానికి మళ్లిస్తారు. (అశోకా వన్ మాల్ వద్ద మళ్లింపు ఉంటుంది).
మాదాపూర్, హైటెక్ సిటీ వైపు నుండి వచ్చే వాహనాలు: మాదాపూర్, హైటెక్ సిటీ నుంచి కైతలాపూర్ వైపు వచ్చే వాహనాలను నెక్సస్ మాల్, JNTU రోడ్ వైపు మళ్లిస్తారు. (యశోద హాస్పిటల్, మాదాపూర్ వద్ద మళ్లింపు ఉంటుంది).
ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణీకులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.