
Maoist Leaders Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.. మావోయిస్టు పార్టీలోని ఇద్దరు కీలక సభ్యులు లొంగిపోయారు. ఎంఎంసీ జోనల్ సెక్రెటరీ అనంత్, ఛత్తీస్ఘఢ్ దర్భ డివిజన్ సెక్రెటరీ శ్యామ్ మహారాష్ట్రలో లొంగిపోయారు.. మహారాష్ట్రలోని గోండియా పోలీసుల ముందు అనంత్ లొంగిపోయారు. గత వారం రోజులుగా ఎమ్మెల్సీ అనంత్ పేరుతో ప్రకటనలు విడుదలయ్యాయి.. జనవరి ఒకటో తేదీ నుంచి సాయుధ పోరాట విరమణ చేస్తున్నట్లు ఇందులో ప్రకటించారు. నిన్న(శుక్రవారం) ఉదయమే సాయుధ పోరాట విరమణపై ప్రకటన చేశారు అనంత్.. అంతలోపే సాయంత్రం పోలీసుల ముందు లొంగిపోయారు. పదిమందితో కలిసి గోండియా పోలీసుల ఎదుట లొంగపోయారు.
READ MORE: Pawan Kalyan : పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై పార్టీ ఎంపీలకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
కాగా.. మహారాష్ట్ర–మధ్యప్రదేశ్–ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (MMC) పేరిట నిన్న(శుక్రవారం) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపిన ఈ లేఖలో ప్రభుత్వం పిలుపు ఇస్తే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. 2026 జనవరి 1 నుంచి ఒక నెలపాటు హత్యాబంద్ (కిలింగ్ స్టాప్), పోరాట విరామం అమలు చేయాలని మావోయిస్టులు నిర్ణయించారు. ఈ విరామ సమయంలో ప్రభుత్వం చర్చల కోసం ముందుకు వస్తే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ప్రధాన అంశాలు..
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు చర్చల కోసం ముందుకు రావాలని, దీనితో అడవి ప్రాంతాల్లో ఉన్న సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తాయని వారు పేర్కొన్నారు. తాము ఇంతకుముందు 2022లో కూడా పోరాట విరామం ప్రకటించినప్పటికీ, అప్పటి ప్రభుత్వాలు స్పందించలేదని MMC పేర్కొంది. ఆ తప్పిదాన్ని ఈసారి పునరావృతం చేయకుండా, ప్రభుత్వాలు నిజమైన చర్చలకు రావాలన్నారు. అడివాసీల భూమి హక్కులు, పోలీసు దాడులు, అభివృద్ధి లోపం వంటి సమస్యలపై ప్రభుత్వాలతో ఓపెన్ డిబేట్లు, చర్చలు జరగాలని కమిటీ డిమాండ్ చేసింది. ఎన్కౌంటర్ పేరుతో నిరపరాధులు చనిపోతున్నారని ఆరోపిస్తూ, ఈ ఘటనలు ఆగితేనే శాంతి చర్చలు సార్థకం అవుతాయని మావోయిస్టులు పేర్కొన్నారు. చర్చలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారికంగా ప్రకటించాలని కోరారు. డిసెంబర్ 1 నుంచి జనవరి 1, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 11 నుంచి 11.15 మధ్య సంప్రదింపులకు ఓపెన్ లైన్గా ఒక ఫోన్ నంబర్ను విడుదల చేశారు. పోరాట విరామ సమయంలో ఏ దాడులు, ప్రతిదాడులు జరగకూడదని, ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని మావోయిస్టులు కోరారు.